
రోడ్ల విస్తరణ పనులు షురూ
వేములవాడ: వేములవాడ పట్టణంలోని మెయిన్రోడ్డు విస్తరణ పనులు ఆదివారం మొదలయ్యాయి. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల వెడల్పు ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. పలుమార్లు కొలతలు తీయడం, యజమానులు అడ్డు చెప్పడం జరుగుతూ వచ్చింది. పక్షం రోజుల క్రితం దుకాణాలకు అధికారులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. దుకాణాలు ఖాళీ చేయకుంటే ఇబ్బందులు పడతారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, నాలుగురోజుల నుంచి 343 మంది నిర్వాసితుల్లో మొదట 10 మంది, రెండోసారి 40 మంది, ఆదివారం మరో 10 మందికి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. దీంతో ఆదివారం మున్సిపల్ అధికారులు తమ వాహనాలతో తరలివెళ్లి పలు దుకాణాలను కూల్చివేశారు. దీంతో వ్యాపారులు బెంబేలెత్తిపోయి తమతమ దుకాణాల్లోని సామగ్రిని సర్దుకునే ప్రయత్నం చేశారు. కాగా ఇందులో కొంత మంది యజమానులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. రూ.47 కోట్లతో మూ లవాగు బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం వరకు 80 ఫిట్లతో రోడ్లను వెడల్పు చేయనున్నారు.
నేటి నుంచి 144 సెక్షన్..
వేములవాడలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా ఈనెల 16 ఉదయం 6 గంటల నుంచి పనులు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని టౌన్ సీఐ వీరప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ చేపట్టే ప్రాంతం నుంచి 100 మీటర్ల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు.