మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు
మార్కాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. వైఎస్ జగన్పై అవమానకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం సాయంత్రం ఆయన పార్టీ నాయకులతో కలిసి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ పంతం నానాజీ సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నాడని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాటామంతి పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన, అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని, ఉద్రిక్తతలను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. జనసేన, టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ వీడిియోలను ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై చర్యలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల వేధింపులు, లాకప్డెత్లు తదితర అంశాలను డైవర్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి చౌకబారు విమర్శలు చేయిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పట్టణ పార్టీ అద్యక్షుడు షేక్ సలీమ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సీహెచ్ శ్రీనివాసులు, నాయకులు రామసుబ్బారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, బట్టగిరి తిరుపతిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బొగ్గరపు శేషయ్య, చెంచిరెడ్డి, చెన్నారెడ్డి, రంగారెడ్డి, ఉత్తమ్కుమార్, రఘుపతి శివ పాల్గొన్నారు.


