● ప్రజల సొమ్ముతో టీడీపీ నేత దర్పం
దర్శి: నగర పంచాయతీలో అధికార పార్టీ నేతల అరాచకం పతాక స్థాయికి చేరింది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ‘వెల్కమ్ బోర్డు’ సాక్షిగా అధికార దుర్వినియోగం వెలుగుచూసింది. పట్టణ ప్రవేశద్వారం వద్ద మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన భారీ స్వాగత తోరణంలో.. ప్రజలు తిరస్కరించిన టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి ఫొటోలు దర్శనమివ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండాల్సిన చోట, ఎన్నికల్లో ఓడిపోయిన నాయకురాలి చిత్రాన్ని ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో వసూలు చేసిన పన్నుల సొమ్మును టీడీపీ నేత ప్రచారానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ ఏర్పాట్లపై కమిషనర్ అర్జున్రావును వివరణ కోరగా.. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలి ఫోన్ కట్ చేయడం గమనార్హం.


