పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ఓ బ్రాందీ షాపు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. యువకుడి తలపై బండరాయితో మోది కిరాతకంగా చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెద్దారవీడు మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన కొర్రపోలు నాగరాజు(23)గా గుర్తించారు. ఇతడు చిన్నపాటి దొంగతనాలకు పాల్పడుతుంటాడని, గతంలో ఈ విషయంలో పోలీసులు మందలించారని బంధువులు చెప్పారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగరాజు పెద్దదోర్నాలలో శవమై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న హసనాబాద్కు చెందిన సోదరి రూతు, మేనమామలు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమీపంలోని పంట పొలాల్లో ఇటీవల విద్యుత్ తీగలు చోరీకి గురయ్యాయని, ఆ కక్షతోనే పొలాల యజమానులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, ఎస్సై వెంకట రమణయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
తలపై బండతో మోదినట్లుగా ఆనవాళ్లు
పెద్దదోర్నాలలో ఓ బ్రాందీషాపు వద్ద ఘటన


