సింగరాయకొండ: పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఈవో పి.కృష్ణవేణి తెలిపారు. శనివారం రాత్రి స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆమె పేర్కొన్నారు.


