● డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాల్లో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాలు చేధించాలని, ఇతోధికంగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో మంగళవారం బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిగా కచ్చితంగా సాధించాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డ్వాక్రా సంఘాలకు, యువత స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయడంతో పాటు యూనిట్ల ఏర్పాట్లలో కూడా వారికి సాంకేతిక సహాయం అందించి త్వరిగతిన యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, నాబార్డు అధికారి రవికుమార్, ఆర్బీఐ ఏజీఎం కిషన్ కుమార్, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎస్.శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వరరావు, జిల్లా సెరికల్చర్ అధికారి డాక్టర్ సుజయ్, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.


