నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.19.02 లక్షలు
సీఎస్పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.19,02,353 ఆదాయం వచ్చినట్లు దేవదాయ ధర్మాదాయశాఖ కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ జీ.ఏ.సత్యనారాయణ, ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ తెలిపారు. సోమవారం స్థానిక ఆలయ ప్రాంగణ భవనంలో కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్, ఆలయ ఈఓ, ధర్మకర్త పర్యవేక్షణలో 2 నెలల 28 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో ప్రధాన హుండీ ద్వారా రూ.17,30,395, అన్నదానం హుండీల ద్వారా రూ.1,71,958 ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరుతూ జిల్లా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేసింది. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు మితికెల గురవయ్య నిరుపేదల జీవన చక్రం సజావుగా కొనసాగేందుకు మధ్య తరగతి, నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపితే చంద్రబాబు తిరిగి ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్, ఒంగోలు 22వ డివిజన్ అధ్యక్షుడు కుట్టుబోయిన సురేష్ పాల్గొన్నారు.


