ఒంగోలు సిటీ: మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ’నీట్’ పరీక్ష ఒంగోలు నగరంలోని ఆరు కేంద్రాల్లో సజావుగా జరిగింది. మొత్తం 1821 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1624 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 197 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు. నగరంలోని నవోదయ, కేంద్రియ విద్యాలయం, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీఆర్ఆర్ఎం పాఠశాల, పీవీఆర్ బాలుర పాఠశాలల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి నీట్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అన్ని సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్, మొబైల్ పెట్రోలింగ్ బృందాల ద్వారా నిరంతర నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలను రెండు జోన్లుగా విభజించి, భద్రతా పర్యవేక్షణ కోసం ప్రతి జోన్కు అదనంగా ఒక ఇన్స్పెక్టర్ను కేటాయించామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల వద్ద ప్రత్యేక హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, సీఐలు ఉన్నారు.


