● పోలీసు పరేడ్ గ్రౌండ్లో యోగాలో పాల్గొన్న కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, శారీరకంగానే కాకుండా మానసికంగా ఆత్మవిశ్వాసనం పెంపొందిస్తుందని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 3.63 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అంతకుమించి హాజరయ్యారని తెలిపారు. గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా 4428 వేదికలపై యోగాభ్యాసన నిర్వహించినట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యవంతులుగా జీవించాలని సూచించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందని, సానుకూల దృక్పథంతో జీవించవచ్చని చెప్పారు.
2 వేల మంది మహిళలతో యోగా...
ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు జరిగిన ఈ యోగా కార్యక్రమంలో 2 వేలకు పైగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నగర ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రెండు వారాలుగా యోగాసనాల్లో శిక్షణ ఇచ్చిన గురువులను ఘనంగా సత్కరించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలను స్వీకరించబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంద్ర నోడల్ ఆఫీసర్ భీమ్నాథ్, డీఎస్పీలు శ్రీనివాసరావు, బాల మురళీకృష్ణ, గురునాథ బాబు తదితరులు పాల్గొన్నారు.


