పొదిలి రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన పొదిలి మండలంలోని మల్లవరం సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కుంచేపల్లి గ్రామానికి చెందిన మేడమ్ లింగారెడ్డి (52) ఆ గ్రామ సమీపంలోని మల్లవరం గ్రామంలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మల్లవరం సబ్స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని ఓ ప్రైవేటు వాహనంలో పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో లింగారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


