జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి పంచాయతీలోని పంగులూరివారిపాలెంలో నేతివారికుంట చెరువును గురువారం ఇరిగేషన్ ఏఈ రవికుమార్ పరిశీలించారు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి ‘సాక్షి’లో ‘కట్టలు తెగిన భూదాహం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు చెరువు వద్ద మట్టి తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇకపై చెరువు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరపాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని, లేకపోతే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా అవసరాలకు చెరువులో మట్టిని ఉపయోగించుకోవటానికి అనుమతి ఇస్తామని అలాగని ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. చెరువుకు సంబంధించి సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఇందుకోసం తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు సర్వే చేయమని దరఖాస్తు చేయనున్నట్లు ఆయన వివరించారు.


