మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో లభించిన శాసనాలకు, పురావస్తుశాఖ గుర్తింపు ఇచ్చిందని ప్రముఖ కవి, శాసన పరిశోధకులు, రిటైర్డు విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు. మార్కాపురం మండలంలోని బొడిచర్ల ఆంజనేయస్వామి దేవస్ధానం, వెలుగొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 16వ శతాబ్ధానికి చెందిన 2 శాసనాలను, చెన్న మల్లేశ్వర ఆలయాల్లోని మరో 2 శాసనాలను మైసూరుకు చెందిన పురావస్తు పరిశోధనా సంస్ధ అధికారులు, పురావస్తుశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం మునిరత్నం రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించి రికార్డు చేశారన్నారు. వెలుగొండ శాసనాలు, శ్రీకృష్ణదేవ రాయుల కాలంలో ఆలయానికి సంబంధించిన దాన ధర్మాలను తెలుపుతోందన్నారు. బొడిచర్ల శాసనాలు 1257 సంవత్సరం కాలంనాటి కాకతీయ గణపతి దేవుడు రాయించిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారన్నారు.


