● కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ స్థాయి మెడికల్ నీట్ పరీక్షను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష సక్రమ నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి రెవెన్యూ, బ్యాంకు, పోలీస్, పోస్టల్, విద్యా, వైద్య, అగ్నిమాపక, ప్రజా రవాణా, విద్యుత్, చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షకు జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో 1,821 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మధ్యాహ్నం 2 రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పీడబ్ల్యూ విద్యార్థులకు 6.20 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. పరీక్ష జరిగే ప్రతి కేంద్రంలో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు వంటి చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష నిర్వహణ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల అవసరమైన బందోబస్తు చర్యలు పటిష్టంగా అమలు చేయలన్నారు. సమావేశంలో డీఆర్వో మాధురి, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఈఓ రేణుక, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్టీసీ ఆర్ ఎం సత్యనారాయణ, నీట్ పరీక్ష సిటీ కో ఆర్డినేటర్ ఎం. మనీష్కుమార్, సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


