బేస్తవారిపేట: మండలంలోని పాపాయిపల్లెలో రెండు గృహాల్లో దొంగలు గురువారం తెల్లవారుజామున చోరీ చేశారు. పాపాయిపల్లెలోని మెయిన్రోడ్డులో ఉపాధ్యాయుడు జి. శ్రీనివాసులు గృహంలో వరండాలో నిద్రపోతున్న యశోద మెడలోని 5 తులాల బంగారు సరుడును దొంగలు లాక్కెళ్లారు. శ్రీనివాసులు గృహం కిందవైపున డి.రంగనాయకులు గృహంలో దొంగలు హల్చల్ చేశారు. రంగనాయకులు బతుకుదెరువు నిమిత్తం కంభం మండలంలోని కందులాపురంలోని అంకాలమ్మ ఆలయం వద్ద రేకులషెడ్డు వద్ద చెరుకు రసం మిషన్ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గృహంలో ఎవ్వరూ లేని సమయంలో ప్రహరీ దూకి మెయిన్ తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువా తాళాలు పగులకొట్టి రూ.15 వేల నగదు, జత వెండి ప్రమిదలు దోచుకెళ్లారు. మార్కాపురం క్లూస్ టీం సభ్యులు వీరాంజనేయులు, సుబ్బరావులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


