● పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ
మద్దిపాడు: పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం వేలాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పొగాకు బోర్డు శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. వేలం నిర్వహణ అధికారులు సూచించిన గ్రేడ్లను వేలం కేంద్రాలకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని రైతులకు సూచించారు. మొదటిరోజు ఆనవాయితీగా చండ్రపాడు గ్రామ రైతులకు చెందిన 18 బేళ్లను వేలంలో ఉంచగా, అన్నింటికీ 250 రూపాయల చొప్పున ధర వచ్చినట్లు ఆమె తెలిపారు. రైతులు మేలిమి రకం పొగాకును వేలం కేంద్రాల్లో ఉంచి మంచి ధర పొందాలని సూచించారు. ఆమె వెంట వేలం కేంద్రం నిర్వహణ అధికారి రామాంజనేయులు, వేలం కార్యనిర్వహణాధికారి గిరిరాజ్కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ హర్ష, రైతు నాయకులు నారిపెద్ది వరహాలు చౌదరి, పల్లకి సత్యనారాయణరెడ్డి, అబ్బూరి శేషగిరి, రావి మహేష్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.


