
తీరువా కష్టాలు !
కన్నీటి ధారలు..
పిచ్చి చెట్లతో నిండిపోయిన పంటకాలువలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. సాగునీరందక అన్నదాత కంట కన్నీటి ధారలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నలకు అన్నీ కష్టాలే. ప్రధానంగా సాగునీటి రంగాన్ని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతుకు ఇది శాపంగా మారింది. పెట్టుబడులు రాక..ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నివైపులా నష్టపోయిన రైతుపై సాగునీటి తీరువా రూ.7.8 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం దారుణమంటున్నారు వ్యవసాయరంగ నిపుణులు
చంద్రబాబు వస్తున్నాడని సాగర్ నీరు విడుదల...
ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శి వస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సాగర్ కుడి కాలువకు శ్రీశైలం డ్యాం నుంచి నీటిని వదిలారు. నాలుగైదు రోజుల నుంచి శ్రీశైలానికి వరద ఉధృతి తీవ్రంగా వస్తుండడంతో గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీళ్లొదిలారు. అయితే కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు సాగర్ నీటిని నాలుగు రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇరిగేషన్ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదు. ఇదిలా ఉండగా చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో హడావుడిగా బుధవారం డ్యాం నుంచి సాగర్ కుడికాలువకు నీరు వదిలారు. దాంతో జిల్లా బోర్డర్ సాగర్ కాలువ 85/3 కిలోమీటరు వద్దకు గురువారం సాయంత్రానికి నీళ్లు చేరుకున్నాయి. జిల్లా బోర్డర్ ముటుకుల వద్ద 2250 క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా జిల్లాలోకి ప్రవేశించింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అసలే వెనుబడిన జిల్లా. దానికితోడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచే జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. అయినా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కనీసం వ్యవసాయ రంగంపై కరుణ చూపించిన దాఖలాలు లేవు. జిల్లాలో చిన్నతరహా నీటి ప్రాజెక్టుల కింద 852 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటితో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కూడా పంటలు సాగుచేస్తున్నారు. ఇవికాకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా పంటలు సాగవుతున్నాయి. వీటన్నింటి కింద జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలకుపైగా ఎకరాల్లో సాగు భూమి ఉంది. అయితే, ఇవన్నీ లెక్కల్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చెరువులు, కాలువల మరమ్మతులకు చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 6.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కరువుతో చివరకు 3 లక్షల ఎకరాల్లో కూడా పంటలు పండలేదు.
పిచ్చిచెట్లతో నిండిన సాగునీటి కాలువలు...
సాగునీటి చెరువులు, కాలువలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. చిన్ననీటి పారుదల చెరువుల నుంచి పంటలకు నీరందించే నీటి సరఫరా కాలువలు సైతం పూడిపోయి పంట పొలాలకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వర్షం పడిందంటే కాలువల్లో నీరు ఎటుపడితే అటు వెళ్లిపోయి వృథాగా మారుతోంది. జిల్లాలోని చెరువుల నుంచి పొలాలకు నీటిని అందించే తూములు సైతం పూడిపోయి ఉన్నాయి. చెరువుల్లో బెడ్లెవల్స్ సైతం పూడికతో నిండిపోయాయి. ఇక, జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన సాగర్ కుడికాలువ పరిస్థితి మరీ దారుణం. సాగర్ ఆయకట్టు కింద దాదాపు 4 నుంచి 4.50 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. అయితే సాగర్ మేజర్ కాలువలు, మైనర్ కాలువలు పిచ్చి చెట్లతో, జమ్ము తూడుతో పూర్తిగా కనపడకుండా కనుమరుగైపోయాయి. సాగర్ నీరు వచ్చినా చివరి ఆయకట్టు వరకు నీరు చేరే పరిస్థితులు లేవు.
కరువుతో సహవాసం...
జిల్లా రైతాంగం కరువుతో సహవాసం చేస్తోంది. 2024–25 రబీ సీజన్లో 20 మండలాల్లో కరువు పీడించింది. ఖరీఫ్లోనూ పంటలు సక్రమంగా పండలేదు. దాంతో రైతులు నష్టపోయారు. జిల్లాలోని రైతాంగానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి రూ.45.27 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపరిహారం రావాల్సి ఉంది. అయినా చంద్రబాబు జిల్లాలోని రైతాంగానికి ఒక్క పైసా కూడా విదిల్చిందిలేదు. 2024–25లో రూ.15.88 కోట్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రూ.29.39 కోట్లు, చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో పంటలు నష్టపోయిన రైతాంగానికి బకాయిపడింది.
నీటి తీరువా కట్టాలంటూ వేధింపులు...
కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి నీటి తీరువా కట్టాలంటూ చేస్తున్న వేధింపులు శాపంగా పరిణమించాయి. ఇప్పటికే రెవెన్యూ అధికారుల ఇళ్లకు నోటీసులు పంపిస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివజన్ల పరిధిలో మొత్తం 5,61,355 మంది రైతులు రూ.7.80 కోట్లు నీటి తీరువా పన్ను కట్టాలని రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు కనిగిరి రెవెన్యూ డివిజన్లో మాత్రమే రూ.5.16 లక్షలు రైతులు చెల్లించారు. నీటి తీరువాతో పాటు ఆలస్యం అయ్యే కొద్దీ 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నారు. అసలుకు తోడుగా వడ్డీ తడిసి మోపైడెందన్న చందంగా రూ.44,10,971.37కు చేరుకుంది.
నీటి తీరువా వివరాలు....
రెవెన్యూ సబ్ డివిజన్ రైతు ఖాతాలు కట్టాల్సిన మొత్తం (రూ) వడ్డీ (6 శాతం..రూ)
మార్కాపురం 193270 1,13,99,488.05 6,83,969.28
కనిగిరి 228272 2,67,48,218.10 16,04,893.09
ఒంగోలు 139813 3,53,68,403.00 21,22,109.00
మొత్తం 561355 7,79,27,075.52 44,10,971.37
జిల్లాలో సాగునీటి రంగం గాలికి చెరువుల మరమ్మతులు పట్టని అధికారులు పిచ్చి చెట్లు, జమ్ముతో నిండిన పంట కాలువలు చెరువులు, కాలువల అభివృద్ధికి రూ.13.26 కోట్లతో ప్రతిపాదనలు ఫైలు తిప్పి పంపిన చంద్రబాబు ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతుపై నీటితీరువా భారం 5,61,355 మంది రైతులు రూ.7.80 కోట్లు చెల్లించాలని నోటీసులు 6 శాతం వడ్డీతో రూ.44 లక్షలు అదనంగా చెల్లించాలంటూ వేధింపులు చంద్రబాబు వస్తున్నాడని హడావుడిగా సాగర్ కుడి కాలువకు నీళ్లు

తీరువా కష్టాలు !

తీరువా కష్టాలు !