గోవు ఘోష పట్టదా..? | - | Sakshi
Sakshi News home page

గోవు ఘోష పట్టదా..?

Nov 9 2024 1:53 AM | Updated on Nov 9 2024 1:53 AM

గోవు

గోవు ఘోష పట్టదా..?

దర్శి:

హింధూధర్మంలో గోవుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హింధువులు పూజించడంతో పాటు మానవుని ఆరోగ్యానికి సైతం అమృతంలా ఆవు ఉపకరిస్తుంది. ఆవు నుంచి వచ్చే పాలు, వాటితో తయారయ్యే పెరుగు, మజ్జిగ, నెయ్యి, చివరకు ఆవు పేడ, మూత్రంతో సహా అన్నీ మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్‌ లాంటి వ్యాధులను సైతం నయం చేసే ఔషధ గుణాలు ఆవులో ఉన్నాయి. అలాంటి ఆవులకు వైద్యం చేయకుండా పశువైద్యులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వాటికి కావాల్సిన మందులు, దాణా సరఫరా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గోవుల మరణాలకు కారణమవుతోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పశువైద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో వైద్య సేవలు అందక పశువులు రోగాల బారిన పడి మృతిచెందుతున్నాయి. గ్రామాల్లో డబ్బున్న రైతులు తమ పశువులకు ఏవైనా వ్యాధులు సంక్రమిస్తే ప్రైవేటు వైద్యం చేయించుకుని నయం చేసుకుంటున్నారు. కానీ, పాడిపైనే ఆధారపడి జీవించే పేద రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ వైద్యం అందక అంతుచిక్కని రోగాలతో తమ పశువులను బలిచేసుకునే పరిస్థితి దాపురించింది. వర్షాకాలం వస్తే సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలుగా టీకాలు వేసి నివారించే విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. కిందిస్థాయి సిబ్బంది పశువులకు టీకాలు వేయకుండానే ఆన్‌లైన్‌లో వేసినట్లు నమోదు చేసి ఉన్నతాధికారుల మెప్పు పొందుతున్నారు. ఉన్నతాధికారులేమో కార్యాలయాలకే పరిమితమై క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఆన్‌లైన్‌ డేటా చూపించి కాకి లెక్కలతో కాలయాపన చేస్తున్నారు. దీంతో మూగజీవాలకు రకరకాల రోగాలు వచ్చి నయం కాక మృత్యువాతపడుతున్నాయి. వాటిపై గ్రామాల్లో అవగాహన కల్పించి సరైన వైద్యం అందించే వారు లేకుండా పోయారు.

తెల్లజాతి పశువుల పర్యవేక్షణ గాలికి...

జిల్లాలో తెల్లజాతి పశువులైన ఆవులు, ఎడ్లు సుమారు 56,820 ఉన్నాయి. వీటిని పర్యవేక్షించి వైద్యం చేయడాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక పశువైద్యాధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. దర్శి నియోజకవర్గంలో వీటి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో పశువుల ఆస్పత్రులకు మందులు అందిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో ఉన్న మందులే సర్దివాడుతున్నారు. కురిచేడు మండలంలోని గంగదొనకొండ, పొట్లపాడు గ్రామాల్లోని ఆవులకు ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేటు వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని ఆవులు ఇప్పటికే మృతి చెందాయి. మరికొన్ని ఆవులకు గోట్‌ఫాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా వేయకపోవడంతో ఆ వ్యాధిబారినపడి కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో లంపి స్కిన్‌తో నిత్యం ఎక్కడో ఒక చోట ఆవులు, ఎడ్లు మరణిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

దేవాలయాలకు ఇచ్చే ఆవులకు దిక్కేది...

ఆవులు, ఎడ్లను అధికంగా దేవాలయాలకు ఇచ్చి గ్రామాల్లో వదిలేసి ఉన్నారు. వీటితో పాటు మందలు మందలుగా వలస ఆవులు ఉంటాయి. ఇలా గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉండే ఆవుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాటి ఆలనాపాలనా చూసే వారే కరువయ్యారు. మొక్కుబడులు మొక్కుకుని ఆవులను దేవాలయాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారేగానీ.. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ గురించి ఏ ఒక్కరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో వాటికి తిండి లేక చెత్తకుప్పల్లో చెత్తాచెదారం, కవర్లు తినాల్సిన దుస్థితి నెలకొంది. కూరగాయల కొట్ల వద్ద కుళ్లిన కూరగాయలు, పండ్లు, రోడ్లు పక్కన పడేసిన ఆహార వ్యర్థాలు, తినకూడని పదార్థాలు తిని రోగాల బారిన పడుతున్నాయి. ఇలా జిల్లాలో రోగాల బారిన పడి చనిపోయిన ఆవులు, ఎడ్లు కోకొల్లలుగా ఉన్నాయి.

దండంపెడతారేగానీ.. అన్నం పెట్టరు..!

ఆవు కనిపిస్తే హింధువులు లక్ష్మీదేవిగా భావించి తమకు ఆర్థికంగా బాగా కలిసిరావాలని కోరుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూజించి దండం పెడతారు. కానీ, వాటికి ఆహారం మాత్రం పెట్టరు. సరైన ఆహారం లేకుండా అవి ఎలా బతుకుతున్నాయి.. వాటి ఆలనాపాలనా ఎవరు చూస్తున్నారని ఆలోచించే వారే కరువయ్యారు.

ఆవులకు నివాసాలేవి..?

ఆలయాల్లో పూజిస్తూ ఉండాల్సిన ఆవులు రోడ్లపై ఆహారం కోసం తిరుగుతున్నాయి. కొన్ని ఆవులు రాత్రి పూట ఎక్కడ ఉండాలో తెలియక రోడ్లపైనే పడుకోవడం, వాహనాల రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురికావడం జరుగుతోంది. కొన్ని ఆవులు రోగాల బారిన పడి పట్టించుకునే వారు లేక జీవచ్ఛవంలా బతికినన్నాళ్లు పోరాటం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆవులపై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులు లేకుండా దొడ్లు ఏర్పాటు చేస్తే రోగాల బారిన పడకుండా ఉండటమే కాకుండా ప్రమాదాలకు గురికాకుండా ఉంటాయి.

వ్యాధులకు బలైపోతున్న ఆవులు, ఎడ్లు

తెల్ల జాతి పశువులను నిర్లక్ష్యంగా

వదిలేసిన పశువైద్యులు

కురిచేడు మండలంలో విజృంభిస్తున్న లంపి స్కిన్‌ వ్యాధి

చోద్యం చూస్తున్న పశువైద్యాధికారులు, ప్రభుత్వం

గోవు ఘోష పట్టదా..? 1
1/1

గోవు ఘోష పట్టదా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement