ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On The Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్‌ జగన్‌

Jun 12 2026 9:41 PM | Updated on Jun 12 2026 9:53 PM

Ys Jagan Tweet On The Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్‌​ చేశారు.

‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ అన్నారు.. సూపర్‌ సెవెన్‌ అన్నారు.. మొత్తం 143 హామీలు త‌న మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మ‌రి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మ‌య‌మే!’ అని వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్ర‌జ‌లు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్‌, క్వార్ట్జ్, లేటరైట్‌ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్‌, డీజిల్ వ్యాట్‌లు పెరిగాయి,  బస్సు ఛార్జీలు పెరిగాయి,  నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి,  పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.

..విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌ల‌తో  యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు,  సూప‌ర్-6, సూప‌ర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు!  ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

..ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌కు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.

..చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌ల‌ను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి ద‌య‌తో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement