దమ్ముంటే ఆత్మకూరులో పోటీచేయండి | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఆత్మకూరులో పోటీచేయండి

Jun 2 2022 4:58 AM | Updated on Jun 2 2022 7:10 AM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం, ధైర్యం ఉంటే సార్వత్రిక ఎన్నికల దాకా ఎందుకు..  ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీచేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. ‘ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేయకుంటే.. మీతో సహా మిమ్మల్ని ఛీకొట్టగా మిగిలిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే దమ్ముందా?’ అని నిలదీశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. అందులో ఏదేదో మాట్లాడి, మీ రెండు పత్రికల్లో వేయించి, మళ్లీ దానిపై టీవీల్లో చర్చలు పెట్టించి.. మీరు స్వయంతృప్తి చెందడం ఎందుకు? చంద్రబాబు కబ్జా చేసిన టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయింది. ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు, సానుభూతిపరులు మహానాడుకు వస్తే.. ఎన్నికల్లో విజయం సాధించేసినట్లుగా.. ఈ విజయం కార్యకర్తలకే అంకితం అని చంద్రబాబు చెప్పడం.. దాన్నే ‘ఈనాడు’ అచ్చేయడం విడ్డూరం.  

ఏడుపు టీడీపీ అధికార గీతమా? 
ఏడుపు అనేది టీడీపీ అధికార గీతంలా అనిపిస్తోంది. అసెంబ్లీలో చంద్రబాబు ఏడవడం మొదలుపెట్టినప్పటి నుంచి అది కొనసాగుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ వెళ్లినా.. సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేసినా చంద్రబాబు, లోకేశ్‌ ఏడుస్తారు. బూతులతో వైఎస్సార్‌సీపీపై పడి ఏడుస్తున్నారు. అలాగే, వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తవడంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 95% అమలు చేసినందున వాటిని ప్రజలకు వివరించడానికి చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. ప్రజలు నిలదీస్తున్నారని వారు చెబుతున్నారు.  

చెప్పుకోవడానికి ఏమీలేకే ఏడుపు 
మాకులాగా మీరు ఏమైనా చేసి ఉంటే చెప్పండి చంద్రబాబూ? ఏమీలేదు కాబట్టే మీరు చెప్పుకోవడంలేదు. మేం చేసినవి చెప్పుకుంటుంటే.. ఎవరెవరితోనో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. దీనివల్ల కడుపు మంట, ఏడుపు కాస్త తగ్గుతుందేమో కానీ.. ప్రజల్లో చులకనవుతారు. మద్యం అమ్మకాల్లో మేం అవినీతి చేశామని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆధారాలుంటే చూపండి. మేం అధికారంలోకి రాగానే బెల్టుషాపులు, పర్మిట్‌ రూమ్‌లు తొలగించాం. షాపులు, మద్యం వినియోగాన్ని తగ్గించాం.  

దావోస్‌ ఒప్పందాలపైనా ఏడుపే 
వైఎస్‌ జగన్‌ హుందాగా దావోస్‌ వెళ్తుంటే, దానిపైనా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏడ్చారు. చివరికి.. రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో చేసుకున్న ఒప్పందాలపైనా ఏడుపే? అప్పట్లో చంద్రబాబు ఇక్కడ సదస్సులు నిర్వహించి, ఏకంగా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారని ప్రగల్భాలు పలికారు. నిజం చెప్పాలంటే ఎవరెవరికో కోట్లు తొడిగించేసి ఆ ఒప్పందాలు చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement