West Bengal: ‘సందేశ్‌ ఖాలీ’పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు | Pm Modi Comments At Womans Rally In Bengal North Paraganas | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బెంగాల్‌: ‘సందేశ్‌ ఖాలీ’ నిరసనలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Mar 6 2024 1:24 PM | Updated on Mar 6 2024 3:56 PM

Pm Modi Comments At Womans Rally In Bengal North Paraganas - Sakshi

కలకత్తా: బెంగాల్‌ పర్యటనలో ప్రధాని మోదీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌ మెట్రో ప్రారంభించిన అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘బెంగాల్‌లో టీఎంసీ హయాంలో మహిళలు వేధింపులకు గురయ్యారు. చిత్రవధ అనుభవించారు.

అధికార పార్టీ టీఎంసీ నేతలే స్వయంగా మహిళలను వేధించారు. టీఎంసీ మహిళలను ఎన్నడూ రక్షించలేదు. సందేశ్‌ఖాళీ ప్రాంతంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు సిగ్గు పడాలి. కానీ టీఎంసీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడవం లేదు. బెంగాల్‌ ప్రజలను వేధించిన నిందితులను కాపాడాడానికి టీఎంసీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి చివాట్లు తిన్నది. సందేశ్‌ఖాలీ తుపాను బెంగాల్‌లో ప్రారంభమైంది.  ఈ తుపాను బెంగాల్‌లోని ప్రతి మూలకు చేరనుంది.

టీఎంసీ నేతలకు తమ అధినేత్రిపై పూర్తి నమ్మకం ఉంది కానీ బెంగాల్‌ మహిళలపై మాత్రం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం లైంగికదాడులకు పాల్పడే వారికి జీవిత ఖైదు శిక్షలు పడేలా చట్టం తీసుకువచ్చింది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన వుమెన్‌ హెల్ప్‌లైన్‌ను టీఎంసీ ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదు. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయలేదు’అని మోదీ మండిపడ్డారు. 

‘మోదీ పరివార్‌’ లాలూ వ్యాఖ్యలకు కౌంటర్‌ కాదు..

‘ఒక రాజకీయ నాయకుడు నాకు కుటుంబం లేదని అన్నందుకే నేను దేశమంతా నా కుటుంబమే అని నినాదమిస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను నా చిన్నతనంలోనే ఇళ్లు వదిలిపెట్టాను. నా దగ్గర అప్పుడు డబ్బులేదు. అయినా నేను ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఆ సమయంలో పేద ప్రజలే నన్ను ఆదుకున్నారు. 

నా జీవితం దేశ ప్రజలకు అంకితం. నా శరీరంలోని ప్రతి అణువణువు, ప్రతి నిమిషం నా దేశ ప్రజల కోసమే. మోదీకి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ తల్లులు,  సోదరీమణులే రక్షణ కవచంలా నిలిచారు’ అని మోదీ తెలిపారు.  

ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ బీజేపీపై దీదీ ఫైర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement