‘ఠాగూర్‌కు రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్‌ తెచ్చుకున్నావ్‌’

MLA Sudhir Reddy Fires On TPCC President Revanth Reddy - Sakshi

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ‘‘రేవంత్‌రెడ్డి.. పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నాడు. మీరు రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతాం’ అంటూ  ఆయన ధ్వజమెత్తారు.

మేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని పేర్కొన్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ దుయ్యబట్టారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్‌ రాజకీయ ఎదుగుదల అంతా వివాదాస్పదమే..
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ లు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.  రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్‌లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top