మంత్రి, జెడ్పీ చైర్మన్‌ మధ్య మాటల యుద్ధం  | Minister Komatireddy Venkat Reddy Vs BRS ZP Chairman Sandeep Reddy | Sakshi
Sakshi News home page

 మంత్రి, జెడ్పీ చైర్మన్‌ మధ్య మాటల యుద్ధం 

Jan 30 2024 1:29 AM | Updated on Jan 30 2024 1:29 AM

Minister Komatireddy Venkat Reddy Vs BRS ZP Chairman Sandeep Reddy - Sakshi

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి మధ్య వాగ్వాదం  

బీబీనగర్‌: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్‌ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు.

దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్‌రెడ్డి డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్‌ పోలీసులను ప్రశ్నించారు.

దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement