
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్గా ముందుకెళ్లాలని.. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్పై సీరియస్గా దృష్టిపెట్టాలన్నారు. కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలని.. ఎక్కడా పొరపాట్లకు తావు ఇవ్వకూడదని ఆయన సూచించారు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.

కొన్ని విభాగాలు మరింత ఫోకస్గా పనిచేయాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకెళ్ళగలుగుతామన్న సజ్జల.. ఫైనల్గా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలన్నారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్గా దృష్టిపెట్టాలని.. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

‘‘అనుబంధ విభాగాలు కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాల పరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగేవారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్ని సీఎం చేసుకుందాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజల తరుపున నిలబడదాం: ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘‘అనుబంధ విభాగాలకు సంబంధించి అందరం కలిసి పనిచేద్దాం. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెడదాం. నేను అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళతాను. మన అనుబంధ విభాగాలు 30 ఉన్నాయి. ఇవి అన్నీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోకస్ చేసి ప్రజల తరుపున నిలబడదాం. మన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళదాం.
..నెలకు ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయాలనే దానిపై అందరం సమన్వయంతో ముందుకెళదాం. కమిటీల నియామకంపై ప్రధానంగా దృష్టిపెడదాం. వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి అవ్వాలి. ఈ నెలాఖరికి ఎట్టి పరిస్ధితుల్లో అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు నియమించుకోవాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తవ్వాలి. జగనన్నను మరోసారి సీఎం చేసుకునేందుకు మనమంతా గట్టిగా పనిచేద్దాం. ప్రజల తలరాతలు మారాలంటే, వారికి మంచి భవిష్యత్ అందాలంటే జగనన్న మరోసారి సీఎం అవ్వాలి’’ అని సాంబశివారెడ్డి పేర్కొన్నారు.