Huzurabad Bypoll 2021: వామపక్షాల దారెటు?       | Huzurabad Bypoll 2021 Left Parties Supports Which Party | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll 2021: వామపక్షాల దారెటు?  

Oct 14 2021 7:44 AM | Updated on Oct 14 2021 7:44 AM

Huzurabad Bypoll 2021 Left Parties Supports Which Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పారీ్టల వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిన నేపథ్యంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ప్రధాన వామపక్షాలుగా గుర్తింపు పొందిన సీపీఎం, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) సహకారం ఏ అభ్యర్థికి లభిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయా పార్టీలకు నియోజకవర్గంలో ఎంత బలం ఉంది.. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకున్నా ఇతర పారీ్టల మద్దతు పోటీలో ఉన్న అభ్యర్థికి నైతికంగా బలం చేకూర్చనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పారీ్టలు ఎవరికి మద్దతు ప్రకటిస్తాయో అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.  

కుల సంఘాల మద్దతు కోసం.. 
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సీపీఐ, టీజేఎస్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పక్షాన వచ్చిన అభ్యర్థనను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా.. లేదా.. అన్న దానిపై పారీ్టలో చర్చించి వెల్లడిస్తామని సీపీఐ, టీజేఎస్‌ నేతలు చాడా వెంకట్‌రెడ్డి, కోదండరాం గతంలో వెల్లడించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరవుతున్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించవచ్చనే చర్చ సాగుతోంది.

అయితే, సీపీఎం కూడా ప్రతిపక్ష ఆందోళనలు, సమావేశాలకు వస్తున్నా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా.. లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సీపీఎం ఇప్పుడు మాత్రం బీజేపీని ఓడించాలని చెబుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో కూడా ఇదే తీర్మానం చేశారు. కానీ, అధికారికంగా ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు.

బీజేపీని ఓడించాలని ఇచ్చే పిలుపును ఆ పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకుంటాయి.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఏ అభ్యర్థి పక్షాన నిలుస్తారన్నది కామ్రేడ్లకే తెలియాలని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు ప్రధాన కుల సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీలున్నంత ఎక్కువ సంఘాల మద్దతు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయతి్నస్తుండడం గమనార్హం.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement