అఖిలేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు' | Sakshi
Sakshi News home page

UP Assembly Election 2022: అఖిలేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు'

Published Sun, Jan 16 2022 5:59 PM

Dara Singh Chauhan 3rd UP Minister To Quit BJP, Joins SP - Sakshi

లక్నో: బీజేపీ పాలనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని, దళితులు, వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లు ప్రశ్నార్థకమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ఏ విధంగా  ప్రైవేటుపరం చేస్తోందన్న విషయం దళితులు, వెనుకబడిన వర్గాలకు అర్థమైందన్నారు. యూపీ రాష్ట్రాభివృద్ధి సమాజ్‌వాదీ పార్టీనే సాధ్యమని పునరుద్ఘాటించారు.

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి ధారా సింగ్‌ చౌహాన్‌ ఆదివారం అఖిలేష్‌ సమక్షంలో ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ లోకి  ఫిరాయింపులు పెరుగుతున్నాయి. ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో మంత్రులు చేరిన నేపథ్యంలో అఖిలేశ్​ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..)

పార్టీలో చేరిక సందర్భంగా దారాసింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. '2017లో బీజేపీ ప్రభుత్వం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ అనే నినాదాన్ని ఇచ్చింది. అందరి మద్దతును తీసుకుంది. అయితే అభివృద్ధి ఫలాలు మాత్రం కొందరికే దక్కాయి. మేము యూపీ రాజకీయాలను మార్చి అఖిలేష్‌ యాదవ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాం. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం' అని చౌహాన్‌ అన్నారు. 

అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు
ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు పెద్ద సవాల్‌ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలేశ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్‌ఎల్‌డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది.  

చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..)

Advertisement
Advertisement