Telangana Politics: మిగిలింది మరో 450 రోజులే!

BJP Tarun Chug On CM KCR Govt - Sakshi

ఆ తర్వాత కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో బంగారు తెలంగాణ సాకారం

కోరుట్ల/ సాక్షి, హైదరాబాద్‌: ‘మిగిలింది మరో 450 రోజులు మాత్రమే.. ఆ తర్వాత కేసీఆర్‌ అహంకార పూరిత కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆలోచనలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బంగారు తెలంగాణ పేరిట ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి బైబై చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే డబుల్‌ ఇంజన్‌తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. బంగారు తెలంగాణ సాకారమవు తుంది..’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ చెప్పారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలో ‘గల్లీలో బీజేపీ– ఢిల్లీలో బీజేపీ ’ పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

యువత కలలను కాలరాసిన కేసీఆర్‌
రాష్ట్ర సాధనతో ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ యువత కలలను కాలరాసిన సీఎం కేసీఆర్, తన కుటుంబంలో అందరికీ రాజకీయ ఉపాధి కల్పించారని తరుణ్‌ ఛుగ్‌ ధ్వజమె త్తారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసి న ప్రజలు కేసీఆర్‌ పాలనతో విసిగిపోయారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యువతలో నైపుణ్యాన్ని వెలికితీయ డానికి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గల్ఫ్‌ వలస బాధితుల కష్టాలు తొలగించడానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమల్లోకి తెస్తామన్నారు. ఈ ప్రాంతవాసుల సౌలభ్యం కోసం ముంబైకి రెగ్యులర్‌గా రైలు నడిచే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సురభి నవీన్‌కుమార్‌ బీజేపీలో చేరారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలి
అంతకుముందు హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బంగారు శృతిలతో ఛుగ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత బండి సంజయ్‌ పాదయాత్రలో స్పష్టమవుతోందని, దీనిని పార్టీకి అను కూలంగా మలుచుకునేందుకు రాష్ట్రం నలుమూలలా ఏక కాలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్లమెంటు ప్రవాస్‌ యోజన కార్యక్రమం కింద రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమితు లైన కేంద్ర మంత్రులతో కలిసి ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేయాలన్నారు.

కాగా నల్లగొండ పార్లమెంటు పరిధిలో      కేంద్ర మంత్రి కైలాష్‌ చౌదరి, హైదరాబాద్‌లో జ్యోతిరాదిత్య సింధియా పర్యటనలు పూర్తయ్యాయని, ఈనెల 21నుంచి 23 వరకు ఆదిలాబాద్‌లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పర్యటన ఉంటుందని ప్రేమేందర్‌ రెడ్డి చెప్పారు. ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీల గురించి సమావేశంలో చర్చించారు. ఈనెల 21న మునుగోడులో అమిత్‌షా బహిరంగసభను విజయవంతం చేయడంపై, 27న బండి సంజయ్‌ పాదయాత్ర ముగిసిన తర్వాత నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశాలపై కూడా మాట్లాడారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top