జాక్‌పాట్‌ కొట్టేసింది..ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే సీటు! | BJP releases second list of 12 candidates, fields singer Maithili Thakur from Alinagar | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌..ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే సీటు.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ

Oct 15 2025 7:16 PM | Updated on Oct 15 2025 8:13 PM

BJP releases second list of 12 candidates, fields singer Maithili Thakur from Alinagar

పాట్నా: ప్రముఖ ఫోక్‌ సింగ్‌ మైథిలీ ఠాకూర్‌ జాక్‌ పాట్‌ కొట్టేశారు. బుధవారం బిహార్‌ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్‌ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు.

 బిహార్‌ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్‌ నియోజకవర్గం నుంచి ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్‌ స్థానాన్ని మైథిలీ ఠాకూర్‌కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. 



మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్‌ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్‌ అనేది భారత్‌–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్‌ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్‌లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్‌ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.

మైథిలీ ఠాకూర్‌ ఇంటర్‌ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్‌ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్‌పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. 

క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్‌ సింగర్‌గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.

కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement