● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించామని, ఈనెలలో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు కేటాయించని మిల్లర్లకు ధాన్యం పంపిస్తున్నట్లు గమనించామని, యాసంగిలో ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు కమిటీ
జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్, ఐఓసీఎల్ ప్రతినిధి మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. ఐఓసిఎల్ ఆధ్వర్యంలో జిల్లాల్లో గ్యాస్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


