ఐదు రోజుల పసికందు మృతి | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పసికందు మృతి

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

వేములవాడఅర్బన్‌: వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన అనూష ఐదు రోజుల క్రితం డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు కాన్పు చేయడంతో బాబు జన్మించాడు. ఐదు రోజుల తర్వాత బాబు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబసభ్యులు బుధవారం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రసూతి కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్య అధికారులు డెలివరీ చేసినప్పటి నుంచి సరైన వైద్య సేవలు అందించలేదని, వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమ బాబు మృతి చెందాడన్నారు.

మెరుగైన వైద్యం అందించాం

వేములవాడ ఏరియా ఆసుపత్రి పిడియాట్రిక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సుహాసిని మాట్లాడుతూ బాబు జన్మించిన నాటి నుంచి బాగానే ఉన్నాడని, మెరుగైన వైద్యం అందించామని, అయితే అకస్మాత్తుగా వచ్చిన ఇన్ఫాంట్‌ సిండ్రోమ్‌ వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, పోస్ట్‌ మార్టం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదన్నారు.

వివాదాల్లో ఏరియా ఆసుపత్రి

వేములవాడ ఏరియా ఆసుపత్రి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సైతం డెలివరీ కోసం ఓ మహిళ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు లేరంటూ వెనక్కి పంపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా జరగడంతో ఆసుపత్రి సేవలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యుల అందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement