
ట్రాక్పైనే రైళ్లు.. ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు
● గంటల తరబడి నిలిచిపోతున్న గూడ్స్ ● సాంకేతిక సమస్యలే కారణమంటున్న అధికారులు ● రైల్వేట్రాక్ అవతలివైపు మల్యాలపల్లి, బద్రిపల్లి గ్రామాలు ● రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పల్లెవాసులు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ బైపాస్ ట్రాక్ నుంచి బద్రిపల్లి, మల్యాలపల్లి గ్రామాల మీదుగా బొగ్గు గనులకు ప్రతీరోజు పదుల సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. గోదావరిఖని కేంద్రంగా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో రవాణా వేగవంతమైంది. రైళ్ల రాకపోకలూ పెరిగాయి. రైల్వేశాఖకూ రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అయితే, బొగ్గు లోడ్తో రామగుండం రైల్వేస్టేషన్కు వచ్చే గూడ్స్ రైళ్లకు ట్రాక్లు ఖాళీగా ఉండడంలేదు. దీంతో వాటిని బైపాస్లోనే నిలిపివేస్తున్నారు. అలా గంటల తరబడి ట్రాక్పై గూడ్స్ రైళ్లు నిలిపివేయడంతో బద్రిపల్లి, మల్యాలపల్లి తదితర గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభిస్తున్నాయి.
ప్రత్యామ్నాయమే లేదు..
మల్యాలపల్లి, బద్రిపల్లి గ్రామాల ప్రజలు రైల్వేస్టేషన్, రాజీవ్ రహదారికి చేరుకునేందుకు గూడ్స్ రైలు ట్రాక్ దాటాల్సిందే. ఇందుకు వేరే ప్రత్యామ్నాయం ఏమీలేదు. అయితే, రైల్వేట్రాక్ లైన్ లభించే వరకూ గూడ్స్ అక్కడ ఎంతసేపు నిలిపి ఉంటే అంతవరకు గ్రామస్తులు నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో రెండు గ్రామాలకు ట్రాక్పక్క నుంచి రోడ్డు నిర్మించిన రైల్వేశాఖ.. ఆ తర్వాత రెండు గ్రామాల పరిధిలో ఖాళీగా ఉన్న ట్రాక్పై వెళ్లే అవకాశం కల్పించింది. కానీ గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగడంతో రహదారి నిష్ప్రయోజనంగా మారింది. ఇక్కడ ప్రత్యామ్నాయంగా భూగర్భ వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ పనులు రైల్వేశాఖ చేపట్టడంలేదు.
పెరిగిన రవాణా
పెరుగుతున్న వస్తు, సామగ్రి రవాణాతో రైల్వేశాఖ బైపాస్ను మూడు లైన్లుగా విస్తరించింది. అయినా.. బద్రిపల్లి, మల్యాలపల్లి గ్రామస్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడంలేదు. ప్రత్యామ్నాయంగా భూగర్భ వంతెన కూడా నిర్మించడంలేదు. రూ.వేల కోట్లతో రైల్వేట్రాక్ విస్తరణ పనులు చేపడుతున్న రైల్వేశాఖ.. లాభాలపైనే దృష్టి సారిస్తోందని, ప్రభావిత గ్రామాల ప్రజల కనీస రవాణా సౌకర్యం గురించి పట్టించుకోవడం లేదని పల్లెవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్పైనే రైళ్లు.. ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు

ట్రాక్పైనే రైళ్లు.. ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు