● భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలి
● దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు
నెల్లిమర్ల రూరల్: శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 28న ప్రత్యేక పూజలు జరగనున్నాయని ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 7గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలను అర్చకులు జరిపిస్తారన్నారు. అనంతరం 9.30 గంటలకు శ్రీరామ, శ్రీలక్ష్మి అష్టోత్తర పూజలు, కుంకుమ పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు స్వయంగా అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి పుష్పార్చన చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అనంతరం రామకోటి లిఖిత జపం, మంగళశాసనం, తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుందని, భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరారు.


