● ఎస్పీ మాధవ్రెడ్డి ● 15 అర్జీల స్వీకరణ
పార్వతీపురం రూరల్: సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చట్టపరిధిలో వాటికి సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన 15 వినతులు స్వీకరించారు. అర్జీదారులు వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలకు సంబంధించిన సమస్యలను ఈ సందర్భంగా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే అందిన ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.


