● ఎస్పీ ఏఆర్ దామోదర్
● పీజీఆర్ఎస్లో 23 ఫిర్యాదుల స్వీకరణ
విజయనగరం టౌన్: హత్య కేసుల్లో త్వరితగతిన విచారణ ప్రారంభించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 23 అర్జీలు స్వీకరించారు. రాజాం పోలీస్స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన యాగిరెడ్డి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు విచారణ చేపట్టలేదని కృష్ణ కుమారుడు యాగిరెడ్డి శ్రావణ్కుమార్ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే రాజాం సీఐకి ఫోన్ చేసి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం భూ తగాదాలకు సంబంధించి 12, కుటుంబ తగాదాలకు సంబంధించి రెండు, చీటింగ్ ఆరు, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కుమారస్వామి, ఎస్బీ సీఐ లీలారావు, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.


