పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం కలెక్టరేట్లో ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రజలనుంచి వినతులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే అర్జీ దారులు మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునని సూచించారు. అర్జీల నమోదు, స్థితి, దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కి నేరుగా ఫోన్ చేయవచ్చునన్నారు. అలాగే కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ను కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
22న మెగా కోలాటం
భారతీయ సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల ప్రతిబింబమైన కోలాటం నృత్యాన్ని ఈనెల 22న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 6వేల మంది విద్యార్థులతో 18 నిమిషాల పాటు ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. 22న ఉదయం 7 గంటల నుంచి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు విద్యార్థులతో కోలాటం నృత్యం చేయించనున్నట్లు తెలిపారు. ఈ నృత్యం ద్వారా చారిత్రాత్మకంగా లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో స్థానం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కె.అచ్చింనాయుడు, గిరిజన సంక్షేమశాఖమంత్రి జి.సంధ్యారాణితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారన్నారు.
గొట్టివలస పరిసరాల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి: గడిచిన రెండు రోజుల పాటు మండలంలోని మరుపెంట, సాంబన్న వలస గ్రామ పరిసరాల్లో సంచరించిన ఏనుగులు ఆదివారం ఉదయం గొట్టి వలస గ్రామ పరిసరాల్లో సంచరించాయి. దీంతో గ్రామస్తులు పంట పొలాలకు వెళ్లేందుకు, రాకపోకలు చేసేందుకు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగులు సంచరించడంతో ద్విచక్ర వాహన చోదకులు సైతం రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


