పాలకొండ: పాలకొండ పట్టణం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజారవాణాధికారి కె. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 గంటలకు నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. పాలకొండ నుంచి ఉదయం 5గంటలకు, 6.40కు, 7.20కు, 11.10కు, మధ్యాహ్నం 2.25కు, 5.40కు, రాత్రి 8.40 గంటలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మూల్యాంకనంలో పొరపాట్లకు తావివ్వొద్దు
● స్పాట్ కేంద్రాన్ని తనిఖీచేసిన జేసీ యశ్వంత్కుమార్రెడ్డి
పార్వతీపురం రూరల్: పదోతరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వొద్దని జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. పార్వతీపురం పట్టణంలోని చర్చివీధిలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిగదిని సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులు జవాబు పత్రాల దిద్దుతున్న తీరును, కోడింగ్, డీకోడింగ్ విభాగాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ప్రతిమార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా మూల్యాంకనాన్ని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న వారికి అసౌకర్యం కలగకుండా చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లిమర్ల రూరల్/తెర్లాం: పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివారు. పుస్తకాలతో స్నేహం చేశారు. విజేతలుగా నిలిచి ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రుల్లో ఆనందం నింపారు. బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ సీజీఎల్ తుది ఫలితాల్లో నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీను ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. అలాగే, తెర్లాం మండలం డి.గదబవలవస గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్కుమార్ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఉద్యోగానికి అర్హత సాధించాడు. బీటెక్ పూర్తిచేసిన వినయ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించాడు. కుమారుడు మంచి ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు యశోద, ఆదినారాయణ మురిసిపోతున్నారు.
విజయనగరం అర్బన్: అమెరికా, ఇజ్రాయిల్ తక్షణమే ఇరాన్పై చేస్తున్న దాడులు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్–1938 జిల్లా శాఖ గురువారం విజయనగరం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోట వద్ద సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు, ఎ.సదాశివరావు మాట్లాడుతూ ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవ సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని, అవి అమాయక ప్రజల ప్రాణనష్టం, ఆర్థిక సంక్షోభం, ప్రపంచ అస్థిరతకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి పరిరక్షణ బాధ్యత కలిగిన ఐక్యరాజ్యసమితి సమస్యను పరిష్కరించాలని కోరారు.
వావిలపల్లి వినయ్కుమార్
కొంగరాపు శ్రీను


