విజయనగరం ఫోర్ట్: ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను తగ్గించడం కోసం ప్రవేశ పెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికశాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే వేతనదారులుగా ఉన్నారు. ముఖ్యంగా పేదలకు వేసవిలో ఎటువంటి పనులు ఉండవు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. పనికి వెళ్లకపోతే వారి జీవనం కష్టతరం అవుతుంది. ఉపాధి హామీ పథకం పనికి వచ్చే వేతనదారులకు 100 రోజులు పని కల్పించాలి. కానీ 100 రోజుల పని కల్పించడంతో టీడీపీ సర్కార్ అలసత్వం వహిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షల్లో వేతనదారులు ఉంటే వారిలో 30 శాతం మందికి కూడా 100 రోజులు పని కల్పించడం లేదనే విమర్శలున్నాయి.
ఉత్తి ప్రకటనలే..
అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. అడిగిన వారందరికి కాకుండా కొంతమందికే పని కల్పిస్తున్నారని వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి ముందు గ్రామీణ ప్రాంత ప్రజలు చైన్నె, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు పనుల కోసం వెళ్లేవారు. ఇటువంటి వారికి పని కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం లక్ష్యం మంచిదే అయినా అనుకున్న ఫలితాలు సాధించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
17,571మందికే 100 రోజులు పని
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 3.86 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో యాక్టివ్ (పనికి వెళ్లే కుటుంబాలు) 3.45 లక్షలు ఉన్నాయి. ఇందులో కేవలం 17,571 మందికి మాత్రమే 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు కల్పించారు. జిల్లాలో వేతనదారులు 6.88 లక్షల మంది ఉన్నారు. వీరిలో 6.26 లక్షల మంది వేతనదారులు పనికి వెళ్లేవారు ఉన్నారు. లక్షల్లో కుటుంబాలు ఉంటే వేలల్లో మాత్రమే 100 రోజులు పని కల్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సకాలంలో జమకాని వేతనాలు
ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వేతనదారులకు పని చేసిన వారం రోజుల్లో వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి. చంద్రబాబు సర్కార్ పాలనలో నెలలు తరబడి వేతనాలు పడడం లేదని వేతనదారులు రావడం లేదని వేతనదారులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు ఉపాధి పనికి వెళితే వచ్చే ఆదాయం ద్వారా జీవిస్తారు. అయితే పనికే వెళ్లే వేతనం డబ్బులు సకాలంలో రాకపోవడం వల్ల వారి కుటంబ పోషణ భారంగా మారుతుంది. దీంతో వేతనదారులకు తిప్పలు తప్పడం లేదు.
100 రోజుల పని కల్పించడంలో
అలసత్వం
జిల్లాలో 3.45 లక్షల ఉపాధి జాబ్ కార్డులు
6.26 లక్షల మంది వేతనదారులు
17,571మందికే 100 రోజులు పని
సకాలంలో జమకాని వేతనాలు
అడిగిన వారందరికీ పని
2025 – 26 సంవత్సరంలో 17,571 మందికి వంద రోజుల పనిదినాలు కల్పించాం. ఉపాధి పని అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నాం.
– ఎస్. శారదాదేవి, పీడీ, డ్వామా


