రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద గురువారం ఛత్తీస్ఘడ్కు చెందిన లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్ఘడ్ కాశిరిది గ్రామానికి చెందిన వినయ్ మిశ్రా (32) దంతారి గ్రామంలోని విజయపురి రైస్ మిల్లులో లారీలో బియ్యం లోడు చేసుకొని విశాఖపట్టణం వెళ్తున్నాడు. మండలంలోని ముచ్చర్లవలస వద్ద ఉన్న సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా జాతీయ రహదారి 26 పక్కన బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో లారీ నిలుపుదల చేసి మద్యం సేవించి రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే వరుసలో మరికొన్ని బియ్యం లోడులతో లారీలు ఆపిన డ్రైవర్లు కింద పడి ఉన్న వినయ్ మిశ్రాను చూసి అతడి లారీలోనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు లారీ ఎక్కించారు. అప్పటికే చనిపోయి ఉన్నట్లు వారు చెబుతున్నారు. మృతదేహాన్ని లారీ క్యాబిన్లో వదిలేశారు. దీంతో మరో లారీ డ్రైవర్ మహేష్ దమన్ మందీప్ రోడ్స్ లైన్స్కు చెందిన మేనేజర్కు ఫోన్ ద్వారా వినయ్ మిశ్రా మృతి చెందిన విషయం చెప్పాడు. మేనేజర్ ఆ రోడ్డు లైన్స్ కంపెనీకి చెందిన ముఖేష్ త్రిపాఠిని ఇక్కడకు పంపించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకుని కొంత మంది లారీ డ్రైవర్లను ఆరా తీయగా వారు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. మృతదేహంపై దెబ్బలు ఉండడం, రక్తపు మరకలు ఉండడం గుర్తించిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందాడా.. లేక ఎవరైనా కొట్టి చంపారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖేష్ త్రిపాఠి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు.


