విజయనగరం ఫోర్ట్: వేసవి తీవ్రత ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఎక్కువగా ఉండడంతో జనం చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎండకు భయపడి చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అయితే అనారోగ్యంతో ఉన్న వారు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తుండగా.. అత్యవసర పనుల మీద సాధారణ ప్రజలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)వెళ్తుంటారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్కు రోగులు గురి కాకుండా ఓఆర్ఎస్ ద్రావణం తాగించినట్టయితే వారికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ప్రతీ పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్ (ఓఆర్ఎస్ ద్రావణం) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పీహెచ్సీల్లో అయితే తాగునీరు కూడా పూర్తి స్థాయిలో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్లు కూడా కొన్ని చోట్ల పనిచేయని పరిస్థితి. దీంతో వాటర్ కేన్లను పెడుతున్నారు. ఇవి రోగులకు పూర్తి స్థాయిలో చాలని పరిస్థితి.
జిల్లాలో 48 పీహెచ్సీలు
జిల్లాలో 48 పీహెచ్సీలు ఉన్నాయి. 18 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఓఆర్ఎస్ ద్రావణం ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎండలో ప్రయాణం చేస్తే వారు డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. వారు ఓఆర్ఎస్ ద్రావణం తాగకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓఆర్ఎస్ ద్రావణం రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేతనదారులదీ అదే పరిస్థితి
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులదీ అదే పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేతనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి వేతనదారులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తున్నారు. ఎండలో పని చేయడం వల్ల వారు ఎక్కువగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. వీరికి ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ బారిన పడకుండా రక్షించబడతారు. ఉపాధి హామీ పథకంలో పని చేసి వడదెబ్బకు గురై వేతనదారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో 3.45 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.26 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో వేలాది మంది వేతనదారులు ప్రతీ రోజు పనికి వెళతారు. వీరికి ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచాలి. లేకుంటే వీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టే.
ఉపాధి పనుల్లోనూ అదే పరిస్థితి
ఎండ తీవ్రతకు అల్లాడుతున్న రోగులు, వేతనదారులు
జిల్లాలో 48 పీహెచ్సీలు
6.26 లక్షల మంది వేతనదారులు
ఓఆర్ఎస్ ద్రావణంతో డిహైడ్రేషన్కు అడ్డుకట్ట
ఆదేశించాం..
పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ఉపాధి వేతనదారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని వైద్య సిబ్బందికి ఇప్పటికే ఆదేశించాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ


