● బ్యాట్ పట్టిన కలెక్టర్, జేసీ
పార్వతీపురం రూరల్: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మండలం వెంకంపేటలో బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్, పరుగు పందెం పోటీలను ప్రారంభించారు. మైదానంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో సీనియర్లు, జూనియర్లకు విడివిడిగా క్రికెట్ మ్యాచ్లు, యువతకు పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు, ఉత్తమ ఉద్యోగులకు ఈ నెల 10న జరగనున్న జాతీయ సర్వే దినోత్సవం వేడుకల్లో బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి ఎం.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.


