విజయనగరం క్రైమ్: డ్రోన్లతో నేరాలను కట్టడి చేస్తున్నామని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని ఎస్పీ మంగళవారం తెలిపారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న శివారు, రద్దీ ప్రాంతాల్లోను, పండగల్లో నిఘా పెట్టేందుకు, దాంతో పాటు ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలు, కోడి పందాలను, చైన్ స్నాచింగ్లు నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్, దొంగతనాలను అరికట్టేందుకు డ్రోన్ ఉపయోగిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకుఈ డ్రోన్స్ వినియోగించి, నేరాలను కట్టడి చేస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరంలోని జేఎన్టీయూ, కలెక్టరేట్ జంక్షన్, కేఎల్ పురం, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ తోటపాలెం, బాలాజీ జంక్షన్ వంటి ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కళాశాలల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్లను పంపి, ఆయా ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశామని ఈవ్ టీజింగు, చైన్ స్నాచింగ్స్, ఇతర నేరాలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. గడిచిన ఆరు మాసాల్లో డ్రోన్ల ద్వారా ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడ్డ వారిపై 180 కేసులు, పేకాట, కోడి పందాలు ఆడుతున్న 51మందిపై, గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.


