● ఈదురుగాలుల బీభత్సం
● నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పాలకొండ రూరల్: పాలకొండలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నూలకూలాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. పాలకొండ మండలంలోని గొట్ట మంగళాపురం, చిన మంగళాపురం, యరకారాయపురం, తుమరాడ తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై చెట్లు కూలిపోయాయి. పాలకొండ–వీరఘట్టం ప్రధాన రోడ్డు, సీతంపేట, శ్రీకాకుళం మార్గాల్లోనూ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పాలకొండ గ్యాస్ ఏజెన్సీ, రాజుపేట సమీపంలోని పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 33 కేవీ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. నవగాం, వంగర మండలాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. రోడ్ల పక్కన ఉన్న చిన్నచిన్న గుడిసెలు, రేకుల షెడ్లు, పశువుల పాకలతో పాటు హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డీఈ కె.విష్ణుమూర్తి పర్యవేక్షణలో ఏఈ యోగి, సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. సరఫరాలో అంతరాయం అధిగమించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు వడగళ్లు పడడంతో మామిడి, బొన్నపంటలకు నష్టంవాటిల్లిందని రైతులు వాపోతున్నారు.


