● పట్టుకున్న స్నేక్ క్యాచర్
విజయనగరం గంటస్తంభం: స్థానిక బాబామెట్టలోని రెండవ లైన్లో ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ అయినంపూడి శ్రీనివాసరావు ఇంటి పరిసరాల్లో ఓ నాగుపాము రెండు రోజులుగా తిరుగుతూ భయాందోళన సృష్టిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మళ్లీ ఆ పాము కనబడడంతో ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు కలెక్టరేట్ ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ సాయికుమార్ వచ్చి పామును పట్టుకుని ఓ డబ్బాలో వేసి మూతవేసి పాముకు గాలి ఆడడానికి డబ్బాకు రంధ్రాలు ఏర్పాటు చేశాడు. పట్టుకున్న పామును పూల్భాగ్ ఫారెస్టులో వదిలిపెట్టనున్నట్లు సాయికుమార్ తెలిపాడు.
3.33 కేజీల గంజాయి స్వాధీనం
పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్పోస్టు సమీపంలో ఉన్న దుర్గ గుడి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి నుంచి 3.33 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అశిష్ పండిట్(23) ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తుండగా పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నాయని గమనించి ఒడిశా నుంచి వస్తున్న వాహనం దిగిపోయి దుర్గగుడి వద్ద అనుమానాస్పదంగా ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా 3.33 కేజీల గంజాయి బయటపడడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని కురుపాం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ(తెలుగు) ఉపాధ్యాయుడి పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బహుదూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండి, టెట్లో అర్హత సాధించినవారు ఈనెల 9లోగా హెచ్టీటీపీఎస్://ఈంఆర్ఎస్.ట్రైబల్.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 11న ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ 6200335685 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
నాలుగు క్లినిక్ల సీజ్
భామిని: మండలంలోని సింగిడి, గురండిలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు, పీఎంపీలు నడుపుతున్న నాలుగు క్లినిక్లను సీజ్ చేసినట్లు బత్తిలి, భామిని వైద్యాధికారులు పసుపులేటి సోయల్, కొండపల్లి రవీంద్రలు గురువారం తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్ఓల ఆదేశాల మేరకు భామిని తహసీల్దార్ శివన్నారాయణ, బత్తిలి ఎస్సై జి.అప్పారావులతో కలిసి సింగిడి, గురండి గ్రామాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్లను సందర్శించి సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. క్లినిక్లలో వాడుతున్న మందులు, సర్జికల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బృందంలో డీటీ రమేష్ కుమార్, ఎంఆర్ఐ మణి ప్రభాకర్, వీఆర్ఓ ఉన్నారు.
నాగుపాము అలజడి
నాగుపాము అలజడి
నాగుపాము అలజడి