
ఎరువు... కృత్రిమ కరువు..!
● అరకొరగా నిల్వలతో రైతన్నలు అవస్థలు ● అదునుకు అందని యూరియా ● ఆవేదనలో రైతన్న
పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం/పాలకొండరూరల్: ఖరీఫ్ సీజన్లో రైతన్నకు ఎరువు కొరత వెంటా డుతోంది. పొలం పనులు మానుకుని ఎరువుకోసం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయ ని అధికార యంత్రాంగం చెబుతున్నా... పంపిణీలో లోపాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఎరువు దొరికితే గంటల తరబడి ఎందుకు నిరీక్షిస్తామని ప్రశ్నిస్తున్నారు. యూరియాను అధికార పార్టీ నాయకులు ఇళ్లకు తరలించి నిల్వచేయడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ఇబ్బందులు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలోని 15 మండలాల్లో 245 రైతు సేవా కేంద్రా ల ద్వారా 7,235 మెట్రిక్ టన్నులు, 22 సొసైటీల నుంచి 1,369 మెట్రిక్ టన్నుల ఎరువులు (యూరి యా, డీఏపీ కలిపి) సరఫరా చేసినట్టు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ తెలిపారు. యూరియా వినియోగా న్ని తగ్గించేందుకు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వే
షిస్తున్నట్టు వెల్లడించారు. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, నానో డీఏపీ ఎరువు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతామని, వాని వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. అయితే, ఎరువు కొరత మాత్రం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువు ఎక్కడికి వెళ్తుందన్నది ప్రశ్నార్థకం.
●పార్వతీపురం మండలానికి 650 మెట్రిక్ టన్నుల యూరియా, సీతానగరం మండలానికి 520 మెట్రిక్ టన్నుల యూరియా, 100 మెట్రిక్ టన్నుల డీఏపీ, బలిజిపేట మండలానికి 550 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ సరఫరాచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎరు వు రైతులకు అందడం లేదని, కృత్రిమ నిల్వలపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.
●గుమ్మలక్ష్మీపురం మండలంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 15వేల ఎకరాలు. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు 224 మెట్రిక్ టన్నుల యూరియా, 106 మెట్రిక్ టన్నుల డీఏపీని తీసుకొచ్చి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేశారు. మరలా 300 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ కోసం ఇండెంట్ పెట్టినా నేటికీ రాలేదు. రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు.
●కురుపాం మండలంలో ఈ ఖరీప్లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 12 వేల ఎకరాల్లో సాగుచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం యూరియా, డీఏపీ కలిపి 330 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా సరఫరా చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదించిన యూరియా, డీఏపీ వస్తుందని, రైతులకు అందజేస్తామని వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.
●జియ్యమ్మవలస మండలంలో ఈ ఖరీఫ్లో సాధారణ సాగువిస్తీర్ణం 9,320 ఎకరాలు. ఇప్పటి వరకు 140 మెట్రిక్ టన్నుల డీఏపీ, 390 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించా రు. మరో 320 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ నిమిత్తం ప్రతిపాదించినా రాలేదు. చేసేది లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
●కొమరాడ మండలానికి ఇప్పటి వరకు 325 మెట్రిక్ టన్నుల యూరియా, 120 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేశారు. డీఏపీ, యూరియా కొరత ఉంది.
●గరుగుబిల్లి మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 14వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 260 మెట్రిక్ టన్నుల యూరియా, 150 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే సరఫరా చేశారు.
●పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 25వేల హెక్టార్లలో వరి పంట సాగుకు రైతు లు ఉపక్రమించగా 60 శాతం యూరియా, డీఏపీని మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైతులు చెబుతున్నారు.
ఎరువులను సరఫరా చేయాలి
రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం ఆధారంగా యూరి యా, డీఏపీ ఎరువులను సరఫరా చేయాలి. ఎరువు లు పూర్తిస్థాయి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఎరువుతో పాటు అదనంగా సేంద్రియ ఎరువులను ఇస్తున్నారు. ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయాన్ని విరమించుకునే పరిస్థితి ఉంటుంది. – ఉరిటి అచ్యుతనాయుడు,
కొత్తపట్నం, పార్వతీపురం మండలం
ఎరువుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది
రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేవు. ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు. ఎరువుల కొరత ఉంది. ప్రభుత్వం స్పందించి అవసరం మేరకు ఎరువులు సరఫరా చేయాలి.
– గుడివాడ సంపత్కుమార్, వైస్ ఎంపీపీ, జియ్యమ్మవలస మండలం

ఎరువు... కృత్రిమ కరువు..!

ఎరువు... కృత్రిమ కరువు..!

ఎరువు... కృత్రిమ కరువు..!