
నేడు వీఆర్ సాగర్ వద్ద యోగాంధ్ర
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్
మక్కువ: పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్రలో భాగంగా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఏనుగుకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఏనుగు కొండ పరిసరాల ను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, అధికారులు ఉన్నారు.
సీతంపేట వైపు ఏనుగులు
భామిని/సీతంపేట: భామిని మండలంలో అల్లకల్లోలం సృష్టించిన ఏనుగుల గుంపు సీతంపేట ఏజెన్సీలోకి సోమవారం ప్రవేశించాయి. భామిని మండలం పోలవరం నుంచి పోలీస్ కోట మీదుగా సీతంపేట మండలం చిన్నబగ్గ, తాబేలవలస గ్రామాలకు చేరుకున్నట్టు అటవీశాఖాధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో ఏనుగుల గుంపు పల్లపు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలకు తరలివెళ్తున్నట్టు భావిస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగులు సంచరించే వైపు ఎవ్వరినీ వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
3,594 మంది టీచర్లకు స్థాన చలనం
● 97 మందికి ఉద్యోగోన్నతులు
● ముగిసిన బదిలీ, ఉద్యోగోన్నతుల తంతు
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో నెలరోజులుగా సాగిన బోధన సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ తంతు ఎట్టకేలకు ముగిసింది. బదిలీ అయిన, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులు సోమవారం నూతన స్థానాల్లో విధులకు హాజరయ్యారు. బదిలీ షెడ్యూల్కు ముందు చేపట్టిన ఉద్యోగోన్నతి ప్రక్రియలో వివిధ కేడర్లకు చెందిన 97 మంది ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం ఏర్పడిన ఖాళీలతో పాటు, క్లియర్ వేకెన్సీ, తప్పనిసరి బదిలీ స్థానాలు, రిక్వెస్ట్ బదిలీ టీచర్లకు చేపట్టిన బదిలీ షెడ్యూల్లో 3,594 మందికి స్థాన చలనం జరిగింది. బదీలీ అయిన వారిలో హెచ్ఎంలు 69 మంది, మోడ ల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 275, స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయు లు 1,345 మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయు లు, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులు 1,816 మంది, భాషా పండితులు 60 మంది, పీఈటీలు 26 మంది, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ మరియు ఇతరులు ముగ్గురు ఉన్నారు.

నేడు వీఆర్ సాగర్ వద్ద యోగాంధ్ర