
సామాన్యుల వరకు యోగా చేరువ కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో సామన్య మానవుడి వరకు యోగాను తీసుకు వెళ్లాలనేదే యోగాంధ్ర లక్ష్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యోగాంధ్ర, డీఏ జుగా, సీఎం సూర్యపవర్, పీఎం జన్మన్ తదితర అంశాలపై జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగా గత 25 రోజులుగా జిల్లాలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం రూపొందించిన కొన్ని పారామీటర్స్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృచేసిన అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటివరకు యోగాభ్యాసంలో భాగంగా మాత్రమే కార్యక్రమాలను చేపట్టామని, ఇదేస్ఫూర్తితో ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పిల్లలు, పెద్దలను భాగస్వాములను చేసి జిల్లా ముందంజలో ఉండేలా కృషిచేయాలని అధికారులను కోరారు.
● సీఎం సూర్యఘర్కు మనవాళ్లే ప్రచార కార్యకర్తలు
సీఎం సూర్యఘర్ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులే ప్రచారకర్తలని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యఘర్ యూనిట్లు ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.
● పీఎం జన్మన్ గృహాలు వేగవంతం కావాలి
జిల్లాలో పీఎం జన్మన్ గృహాలు మరింత వేగవంతం కావాలని, ప్రతివారం ప్రగతి కనిపించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కురుపాం, సీతంపేట, జీఎల్ పురం మండలాల్లో ప్రగతి కనిపించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.