గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్‌

Jun 13 2025 5:07 AM | Updated on Jun 13 2025 5:07 AM

గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్‌

గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్‌

విజయనగరం క్రైమ్‌: గత ఏడాది గంజాయి కేసులో అరెస్ట్‌ అయిన ఒడిశా వాసికి చెందిన రూ.42 లక్షల ఆస్తులు సీజ్‌ చేశామని ఎస్పీ వకుల్‌ జిందల్‌ గురువారం తెలిపారు. 2024లో జిల్లాలోని ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ మండలం, బసుపుట్‌ గ్రామానికి చెందిన వ్యాపారి పతి ఖిల అలియాస్‌ గురు (32)కు చెందిన రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గురు 200కిలోల గంజాయిని గతేడాది అక్టోబరు 6న తరలిస్తూ ఎస్‌.కోటలో పందిరప్పన్న జంక్షన్‌ వద్ద పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు గురు కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. అలా వచ్చిన అక్రమ సంపాదనతో రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్థులను కూడబెట్టినట్లు గుర్తించామన్నారు. ఆస్తుల అటాచ్‌ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్‌.కోట ఇన్‌స్పెక్టర్‌ వి.నారాయణమూర్తి, ఇతర పోలీసు అధికారులను ఎస్పీ వకుల్‌ జిందల్‌ అభినందించారు.

గంజాయి నిందితుడి అరెస్ట్‌

సాలూరు రూరల్‌: మండలంలోని దుద్దిసాగరం గ్రామ శివారులో గత నెల 7వ తేదీన 183.800 కేజీల గంజాయితో కారును రూరల్‌ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో పరారైన నిందితుల్లో ఒకడైన దీపక్‌ కుమార్‌ పొధార్‌ను ఈ నెల 10వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని సెమిలిగుడలో గల ఫ్యూజన్‌ హోటల్లో పట్టుకున్నట్లు రూరల్‌ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మెజిస్ట్రేట్‌ వద్దకు రిమాండ్‌ నిమిత్తం పరిచినట్లు చెప్పారు.

పాము కాటుతో వ్యక్తి మృతి

దత్తిరాజేరు: మండలంలోని చినకాద గ్రామానికి చెందిన ఆవాల సూర్యనారాయణ(31) పాముకాటుకు గురై మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్‌ జయంతి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు సూర్యనారాయణ 10వ తేదీ రాత్రి గ్రామ సమీపంలో మల విసర్జనకు వెళ్తున్న సమయంలో చీకట్లో పాము కాటు వేయడంతో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement