
మరుగున బడిన వైభవం
● గత ప్రభుత్వంలో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, బెల్ట్ పంపిణీ ● పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు ● నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖల మార్పు ● నేడు అధ్వానంగా పాఠశాలలు ● తాగేందుకు నీరులేని పరిస్థితి ● అస్తవ్యస్తంగా పాఠశాలల నిర్వహణ ● ఉపాధ్యాయులకు అందని తల్లికి వందనం ఉత్తర్వులు
పార్వతీపురం రూరల్:
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టి అమలు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అమ్మ ఒడి పేరుతో నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇచ్చిన హామీ మేరకు రూ.15వేలు తల్లుల ఖాతాల్లో జమచేసేది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పాఠ్యపుస్తకాల ను, బ్యాగ్లను, బూట్లు, సాక్సులు, బెల్ట్తో పాటు రెండు జతల యూనిఫాం ఇచ్చి వాటిని కుట్టించేందుకు తల్లిదండ్రులపై భారం లేకుండా కుట్టుకూలి సైతం ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా మౌలిక సదుపాయాల కల్పన కు సైతం నోచుకోని దుస్థితి విద్యాలయాల్లో నెలకొంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో నాడు– నేడు పథకం ద్వారా అత్యంత ఆధునికంగా పాఠశాలల రూపురేఖలను తీర్చిదిద్ది మెరుగైన సదుపాయా లు కల్పిస్తే వాటి నిర్వహణను సైతం కూటమి పాలకులు గాలికొదిలేశారు. దీంతో ప్రభుత్వ విద్యాలయాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి.
తాగేందుకు నీరు లేక..
ప్రతి పాఠశాలలో సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కూటమి పాలకుల నిర్లక్ష్యంతో వాటి నిర్వహణ కూడా చేయలేని పరిస్థితుల్లో అవి మూలకు చేరి నిరుపయోగంగా ఆయా పాఠశాలల్లో దర్శనమిస్తున్నాయి. గత విద్యాసంవత్సరం నుంచి తాగునీటి విషయంలో ఈ సమస్య ఉందని తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు ఓ గదిలో పెట్టి తాళం వేసి ఉంచుతున్న దృశ్యాలు ప్రతి పాఠశాలలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు రావడం లేదని బదులిస్తున్నారు. అరకొరగా వచ్చిన నిధులు స్టేషనరీ నిర్వహణకు ఉపయోగిస్తున్నామని బదులిస్తున్నారు.
నిర్వహణ లోపంతో..
పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు, ప్రాంగణాలు, తుప్పలు, డొంకలతో అధ్వానంగా దర్శనమిస్తున్నా యి. అలాగే వంటశాలల నిర్మాణాలు లేక తరగతి గదుల పక్కనే వంట నిర్వహణ జరుగుతోంది. గత ప్రభుత్వంలో విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో విద్యాలయాలను తీర్చిదిద్ది కార్యాచరణ చేస్తే ప్రస్తుతం పాఠశాలల పరిస్థితి నిర్వహణలో పంతో అధ్వానంగా మారింది. మూలకు చేరిన బెంచీలు, అధ్వానంగా ఉన్న తరగతి గదులతో నేలపై కూర్చుంటున్న విద్యార్థులు, మరమ్మతులకు గురై మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు, పాడైన ఆట వస్తువులు, తలుపులు లేని తరగతి గదులు ఇలా పలు సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. 30మంది దాటి విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.25వేలు నిర్వహణ నిమిత్తం మంజూరు చేయగా 30కి తక్కువ మంది ఉన్న విద్యార్థుల పాఠశాలలకు రూ.10వేలు మంజూరు చేస్తున్నారు. ఈ కొద్దిమేర నిధులను సైతం విడతల వారీగా విడుదల చేయడంతో పాఠశాలలో నిర్వహణ కష్టతరం అవుతుందని ఉపాధ్యాయులు బాహాటంగానే బదులిస్తున్నారు.
ఉత్తర్వులు రాలేదు
నాడు అమ్మ ఒడి పథకానికి సంబంధించి తల్లిదండ్రుల వివరాలు పాఠశాల ద్వారా నివేదికలు సమర్పిస్తే డీబీటీ పద్ధతిలో వారి ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం నగదు జమచేసేది. అయితే పాఠశాల నిర్వహణకు రూ.వెయ్యి తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు చేరేది. ప్రస్తుతం ప్రభుత్వం గురువారం నేరుగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పేరిట రూ.15వేలు జమ చేస్తామని బహిరంగంగా చేసిన ప్రకటన మేరకు తమకేమీ ఉత్తర్వులు రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు సైతం వారి ఖాతాల్లో ఎలాంటి నగదు జమ కాలేదని చెబుతున్నారు. ఏ నివేదిక ప్రకారం ఎంత మందికి తల్లికి వందనం జమ చేస్తారో? లేదా ప్రకటనలకే పరిమితం అవుతారో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. నాటి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగా పండగ వాతావరణంలో వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏవీ కన్పించడం లేదని తల్లి దండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరుగున బడిన వైభవం

మరుగున బడిన వైభవం

మరుగున బడిన వైభవం