● ఏసీఏ క్రికెట్ స్టేడియంలో డబ్ల్యూఏపీఎల్ను ప్రారంభించిన నారా బ్రాహ్మణి ● డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన బ్రాహ్మణి, మిథాలీరాజ్
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఎపిఎల్) టీ–20 క్రికెట్ తొలి సీజన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, డబ్ల్యూఏపీఎల్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్ సంయుక్తంగా డబ్ల్యూఎపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.
రాయలసీమ జెన్ స్టార్ విజేత
శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్ జుట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుకు మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయలసీమ జెన్ స్టార్ జట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయలసీమ జెన్ స్టార్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి గోదావరి గోల్డెన్ ఈగల్ జట్టును 116 పరుగులు చేశారు. వీరిలో కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 63 పరుగులు, గుండుపల్లి ఉద్విత 30 పరుగులతో రాణించారు. రాయలసీమ జెన్ స్టార్లో బి అనూష మూడు వికెట్లు పద్మజ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయలసీమ జెన్ స్టార్ జట్టు మూడు వికెట్లు నష్టానికి 120 పరుగులు చేసి విజయం సాధించింది రాయలసీమ జెన్ స్టార్ లో ఓపెనర్లు సీత సాయి 33 పరుగులు శుభశ్రీ 23 పరుగులు చేశారు. బౌలింగ్లోను బ్యాటింగ్లోను పద్మజా రాణించింది. రెండవ మ్యాచ్ అమరావతి చాంపియన్స్కు వైజాగ్ ఫైర్ బర్డ్స్కు మధ్య మ్యాచ్ జరిగింది. అమరావతి చాంపియన్స్ జట్టు విజయం సాధించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు.


