రొంపిచర్ల: పల్నాడు జిల్లా పురుషుల, మహిళల సీనియర్ బేస్ బాల్ ఎంపిక ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి.వేమారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 20 మంది చొప్పున పురుషులు, మహిళా క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా బేస్ బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.సైదయ్య మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారుల్లో మహిళలకు సెప్టెంబర్ ఒకటి నుంచి రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పురుషులకు మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్లో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన 16 మంది క్రీడాకారులను మెయిన్ టీంగా సెలెక్ట్ చేసి వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో పుట్టపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నటు చెప్పారు. కార్యక్రమంలో పీడీ వై.వి.చిరంజీవిరావు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పిడెం హుస్సేన్, పంబా వెంకట్ పాల్గొన్నారు.


