జిల్లాలో 2.80 లక్షల మందికిపైగా రైతులు...
జిల్లాలో భూ యజమానుల కంటే కౌలు రైతులు కీలకంగా ఉన్నారు. 28 మండలాల్లో 2.80 లక్షల మందికిపైగా అన్నదాతలు ఉన్నారు. వీరిలో పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందుతున్న వారు దాదాపు 1.93 లక్షల మందికిపైగా ఉన్నారు. సాగుపై ఆధారపడిన కౌలు రైతులకు ప్రభుత్వం సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే 2011లో కౌలు రైతుల చట్టం వచ్చింది. 2019లో ఆ చట్టాన్ని సవరిస్తూ భూ యజమానుల అంగీకారంతోనే కౌలు కార్డులు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. రైతులందరికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నూతన చట్టం తెచ్చి కౌలు రైతులను ఆదుకోనున్నట్లు ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తూ కౌలు రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టింది. అన్నదాత సుఖీభవ కింద ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2,40,530 మందికి అందిస్తున్నట్లు లింగంగుంట్ల సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. సదరు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి రూ.38.75 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్రం నుంచి రూ.120.26 కోట్లు వంతున మొత్తం రూ.159.01 కోట్లు జమ కానున్నాయి.
తప్పని అప్పుల భారం
సాగు కోసం అప్పులు చేసిన కౌలు రైతులు పెట్టుబడుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో సాగు వ్యయం మరింత పెరిగిందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి సాయం అందకపోవడంతో ప్రైవేట్ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే వరకు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని వాపోతున్నారు. బ్యాంకు రుణాలలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆశలు పెట్టుకున్నాయి. వెంటనే కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
పెట్టుబడి సహాయానికి ఎగనామం
2,40,530 మందికే నగదు జమ
39,651 మందికి అందని సాయం
కనికరం కూడా చూపని
చంద్రబాబు సర్కార్
అప్పుల పాలవుతున్న కౌలు రైతులు
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను రెండేళ్లుగా కన్నీరే మిగిల్చింది. వ్యవసాయమే జీవనాధారమై భూ యజమానుల నుంచి కౌలుకు తీసుకున్న భూమిలో రెక్కల కష్టాన్ని నమ్మి సేద్యం చేసే వారిపై కనికరం కూడా చూపడం లేదు. ‘అన్నదాత సుఖీభవ’ కింద మొండిచేయి చూపుతోంది. రెండేళ్లుగా ఆశగా చూస్తున్న కౌలు రైతులకు అన్యాయం చేసింది.


